తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల జనసేన పార్టీ తరఫున సమన్వయం కోసం కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ తెలంగాణ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. కమిటీలో అయిదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా నేమూరి శంకర్ గౌడ్, రాధారం రాజలింగం, పొన్నూరి శిరీష, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ములుకుంట్ల సాగర్ ఉంటారన్నారు.
కాగా జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ గా ప్రముఖ నటుడు ములుకుంట్ల సాగర్ ను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. తెలంగాణ నాయకుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. కరీంనగర్ జిల్లాతోపాటు తెలంగాణవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సాగర్ కు సూచించారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు.

