విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.. భావితరాలకు ఆదర్శవంతంగా నిలబడాలి.. సామాన్యుడి తరపున గళం విప్పాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దశాబ్దం క్రితం జనసేన పార్టీని స్థాపించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం స్వార్ధ రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైద్ధాంతిక విలువలతో జనసేన అడుగులు వేస్తోందని తెలిపారు.
అప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్న పార్టీలను ఎదుర్కొంటూ, పోరాటాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన తీరు అద్భుతమన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన అలాంటి స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగిస్తున్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, జనసైనికులకు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు తెలిపారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించారు.
కార్యాలయంపై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీగా దశాబ్దకాలంగా చేస్తున్న పోరాటాన్ని ప్రజలు మరచిపోరన్నారు. స్థానిక ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో బలంగా నిలబడిన పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ, బీజేపీలను సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.

