తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 31 నుండి ఆందోళన చేపట్టిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ 35 రోజుల ఆందోళన అనంతరం సోమవారం ఉదయం నుండి ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె ప్రారంభించారు. సూపరింటెండెంట్ డా. విఠల్ జోక్యంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈఎస్ఐ వాటా కార్మికుల జీతాల నుండి కత్తిరింపులు ఆపాలని, ఆ సొమ్ము తిరిగి కార్మికుల ఖాతాలకు జమచేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఇప్పుడు ఇస్తున్న జీతానికి మరికొంత సొమ్ము కలిపి చెల్లిస్తామని కాంట్రాక్టు సంస్థ తరపున గోకేడ రాంబాబు తెలిపారు. పెంపుదల ఎప్పటి నుండి అమలు అనే విషయం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులు జనరల్ బాడీ నిర్వహించుకుని మంగళవారం ఉదయం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇతర డిమాండ్స్ పై కూడా ఒక అంగీకారానికి రావాల్సి ఉందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మాతాశిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. పలు సంఘాల నాయకులు శానిటేషన్ వర్కర్స్ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. నాయకులు పలివెల వీరబాబు, మలక వెంకట రమణ, పాలిక రాజేంద్ర ప్రసాద్, యూనియన్ నాయకులు సి.హెచ్. విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు..

