జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి భారీ విరాళాన్ని అందించారు. తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకి కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు విరాళం ఇస్తుంటారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం ఆయన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా అందించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నంకి విరాళం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని అన్నారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పదన్నారు.
ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు మర్రెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

