కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవగాహన రహిత ఆరోపణలు ప్రజలు పట్టించుకోవలసిన అవసరం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక గాంధీనగర్ పార్క్ సమీపంలో బహిరంగ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరానికి ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు కాకినాడ బాగుకోసం ముందుకొచ్చి సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములు లేని సమయంలో తన వంతు బాధ్యతగా విద్యుత్ సబ్స్టేషన్ కు ప్రైవేట్ వ్యక్తుల నుండి స్థలాన్ని సేకరించి వారికి టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి మంచి పనిని సహించలేని మాజీ ఎమ్మెల్యే కొండబాబు నగరంలో అనేక చోట్ల ప్రభుత్వ భూములు, పోర్టు భూములు ఉన్నాయని వాటిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించొచ్చు కదా అనే అవగాహన రహిత సూచనలు చేయడం బాధాకరమైన విషయమన్నారు.

