కాండ్రకోటలో గత కొన్ని రోజులుగా క్షుద్ర పూజల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు భూపాలపట్నంలోనూ జరిగిందంటూ కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్. తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ రోజు తెల్లవారుజామున అతను భూపాలపట్నం ఆటో కిరాయి నిమిత్తం భూపాలపట్నం గ్రామానికి వెళ్లగా ఆటో నిలిపిన వీధిలో రోడ్డుపై ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, ఎండుమిర్చి, కొబ్బరికాయ మరియు ఒక బొమ్మ ఉండటం చూసానని పేర్కొన్నాడు.
అదే సమయంలో ఒక నల్లని ఆకారం తన వైపుగా రావడంతో కంగారుపడి ఆటోలో అదే ముగ్గు మీద నుండి వెళ్లిపోయినట్టు తెలిపాడు. ఈ సంఘటనను బట్టి రెండు రోజుల క్రితం చిల్లంగి అమావాస్య రోజు కాండ్రకోట గ్రామంలో పూజలు నిర్వహించడంతో ఆ ఊరిని వీడి ఆ వింత ఆకారం భూపాలపట్నం వచ్చిందేమో అని వదంతులు వ్యాపిస్తున్నాయి.
