జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుందని పార్టీ అధ్యక్ష కార్యదర్శి పి. హరిప్రసార్ తెలిపారు. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయన్నారు. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారని తెలెపారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరగనున్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు.

