రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అధికార వైకాపా ప్రభుత్వం చేస్తుందని దాని అంతం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ సిటీతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు, డ్రగ్స్, మద్యం, ఇసుక వంటి అరాచక మాఫియా రాజ్యం నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అనుచరులతో కలిసి భీమవరానికి 100 కార్లతో ర్యాలీగా తన స్వగృహం జగన్నాధపురం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీలో అందరికీ సముచిత స్థానం లభిస్తుందన్నారు.
తాను పవన్ ఆశయాలు నచ్చి జనసేనలోకి చేరుతున్నానని ప్రకటించారు. కాకినాడ నగరంలో భూకబ్జా, అక్రమాలు బాగా పెరిగిపోయాయని, దానిని అడ్డుకోవాలంటే ఒక జనసేన ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలను జనసేన ద్వారా కాకినాడ వాసులకు తెలియజేసి వారిని జాగృతం చేస్తామని మల్లాడి అన్నారు. మత్స్యకారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

