ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు.
రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జాడలు మాత్రం కనబడడం లేదన్నారు. ఇప్పుడు సిద్ధం.. సిద్ధం అంటూ ఎన్నికలు అంటే ఏదో యుద్ధ వాతావరణం అన్న భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఎన్నికల ముందే వై.సీ.పీ. ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించే చంద్రబాబు నాయుడు రా.. కదలిరా.. సభలో జనసేన శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

