వై.సీ.పీ. ప్రభుత్వ అవినీతి, అరాచకం, దోపిడీ, డ్రగ్స్, రౌడీ, గూండా, కబ్జా పాలనను అంతమొందించేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శంఖారావం సూపర్ సిక్స్, భవిష్యత్తు గ్యారెంటీ, తదితర అంశాలపై కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారని, వై.సీ.పీ. ప్రభుత్వ అరాచక విధ్వంసక పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. వై.సీ.పీ. అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాకినాడ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని, జగన్ రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడంతో ఆ భారం ప్రజలపై పడి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, నృసింహదేవర విశ్వనాధం, SK రహీమ్, గదుల సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

