స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆరోపించారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధుల బృందం, సంఘం ఉపాధ్యక్షురాలు వాడపల్లి వెంకటరమణమ్మ సారధ్యంలో సీతారామరాజు తపస్సు చేసిన గోపాలపట్నంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వర ఆలయం, అల్లూరి చదువుకున్న తుని రాజా హైస్కూల్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీతమ్మ కొండపై ఉన్న ఆలయానికి సరైన రోడ్డు లేక అల్లూరి అభిమానులు, పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రోడ్డును నిర్మించాలన్నారు. స్థానికులు పలుమార్లు మంత్రి దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆలయాన్ని సందర్శించి రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అల్లూరికి భారతరత్న ఇవ్వాలి ఆయన కోరారు. అదేవిదంగా అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శులు లక్కాకుల బాబ్జీ, శివంగి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు పోతిన వెంకటేశ్వరరావు, తుని రాజా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టి. శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.

