
సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు నిర్వహించడాన్ని నిషేదిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర పోలీసు అధికారులు అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ కోడి పందాలకు అనుమతుల్లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అందుకు తగ్గట్టుగా అన్ని పోలీస్టేషన్ల సిబ్బంది అవగాహణా కార్యక్రమాలు నిర్వహించారు.
ఎవరైనా అతిక్రమిస్తే ఖపడ్ధార్ అని వార్నింగ్ ఇచ్చారు. అయినా లెక్కలేదు… లెక్కలేనన్ని కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. వేలాది కోడిపుంజుల ప్రాణాలకు కత్తివేటు వేశారు. రోజుకి రూ.100 కోట్ల పైగా కోడి పుంజులపై పందాలు కాచారు. దేశ విదేశాల నుంచి సాంప్రదాయం పేరిట స్వస్థలాలకు చేరుకుని పోటీ పడ్డారు. ఒక్క కోడిపందాలే కాకుండా నిషేదిత క్రీడలైన పేకాట, గుండాట వంటి జూద క్రీడలు కూడా బహిరంగంగానే నిర్వహించారు. కోడి పందాల బరుల నిర్వాహకులే లక్షల సొమ్ము ఇటు పోలీసులకు, అటు ప్రజా ప్రతినిదులకు ముట్టజెప్పడంతో ఎవరూ కిమ్మనకుండా, కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కలేకుండా వ్యవహరించడం పరిపాటిగా మారిపోయింది.

