
స్టిక్కర్లు వేశారు…. ఇంటింటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. బ్రోచర్లు అందజేశారు… గడపగడపకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతి వారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్సెల్కు పేరు మార్చి స్పందన అన్నారు… అది కాస్తా జగనన్నకు చెబుదాం గా మార్చారు. తాజాగా “ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే…” అంటూ మరో ప్రచార కార్యక్రమాన్ని 9 నవంబర్ నుంచి చేపట్టారని ప్రతిపక్షాలు, వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ పార్టీల మాటెలా ఉన్నా… పేరు తప్ప ప్రచార కార్యక్రమం అంతా ఒకటేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటింటికి నాయకులు, కార్యకర్తలు వెల్లడం పథకాల కోసం వివరించి చెప్పడం షరా మామూలే. రికార్డులలో గణాంకాలను గణనీయంగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అయితే వాస్తవ జీవన స్థితిగతులకు అవి సరితూగు తున్నాయా లేదా అన్నదే ఇక్కడ మీమాంస. ఉల్లి ధర కేజీ రూ.80 కి పెరిగింది. పప్పు, ఉప్పు, మిర్చి, మసాలా ధరలు నషాలానికి అంటుతున్నాయి. వంట గ్యాస్, పెట్రోల్ దరలు కేంద్రం పరిదిలోనివి అని సరిపెట్టుకున్నా… రాష్ట్ర ప్రభుత్వం వేసే టాక్స్లు కూడా వాటి దరలను ప్రభావితం చేస్తుంటాయి. ఏడాదికి పాతిక వేల రూపాయలిచ్చినా… ఒక్కో మనిషికి నెలకు ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చినా… అదే జీవనాధారం కాబోదు.
ఎందుకంటే పెరిగిన దరల నేపధ్యంలో ఒక చిన్న కుటుంబానికి నెలకు రూ.15,000 వ్యయం అవుతుంది. ఒక్కో మనిషికి నెలకు కనీసం 10 కేజీల బియ్యం వినియోగ మవుతాయి, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఒక కుటుంబానికి నెలకు కనీసంగా రూ.1500 వ్యయం కేవలం బియ్యానికి ఖర్చు అవుతాయి. ఏడాదికి రూ.10,000 ఇచ్చే బదులు నెలకు కనీసం పదివేలు వచ్చే ఉద్యోగం లేదా ఉపాధిని చూపిస్తే ప్రభుత్వం అప్పులపాలయ్యే పరిస్థితి ఉండదని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. ప్రచారంతో పని లేకుండానే ప్రజలు ప్రాధాన్యతనిస్తారంటున్నారు.

