రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జరుగుతున్న అక్రమాలను ఎత్తి చూపినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎం.పీ. విజయ సాయి రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ” పురందేశ్వరి మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు – కానీ నేను మద్యం సేవించను” అని అవమానకరంగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న దుయ్యబట్టారు. మహిళల పట్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చులకన భావానికి విజయసాయి రెడ్డి మాటలు దర్పణం పడుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో మద్యం తయారీ చేస్తున్న డిస్టిలరీ కంపెనీల మీద అదేవిధంగా బిల్లులు లేకుండా నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నటువంటి మద్యం దుకాణాల మీద అనేకమంది అనేక ఆరోపణలు చేస్తున్నారని, పురందేశ్వరి స్వయంగా బిల్లులు లేని మద్యం వ్యాపారాన్ని ఇటీవల బట్టబయలు చేశారని అందుకు ప్రతిఫలంగా ఆమెపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం విజయసాయి రెడ్డికి ఎంత మాత్రం తగదని లక్ష్మీ ప్రసన్న అన్నారు.
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్, ఇంచార్జ్ కోడూరి లక్ష్మి నారాయణ, కాకినాడ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ముత్త నవీన్ తదితర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

