మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే వేట నిషేధ పరిహారం అందించాలని సీ.పీ.ఎం. కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం మధ్యాహ్నం సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు కాకినాడలోని ఏటిమొగ రోడ్ లో మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఒక ప్రక్క ధరలు విపరీతంగా పెరిగిపోతూవుంటే కుటుంబ జీవనం కష్టంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. వేట నిషేధం మొదలైన మొదటి వారంలోనే పరిహారం అందించాలని వారు కోరారు.
బోటులో పనిచేసే వారందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ… ఏప్రిల్ 15 న వేట నిషేధం ప్రారంభం అయితే నెల రోజులు గడిచినా పరిహారం ఊసే లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలకు, మత్స్యకారుల పరిహారానికి సంబంధం లేదన్నారు.
మత్స్యశాఖ అధికారిని సంప్రదించగా మత్స్యకారుల వివరాల సేకరణకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదని చెప్పారని తెలిపారు. 61 రోజుల జీవనానికి కేవలం రూ. 10,000 ఇస్తారని అదీ కూడా సకాలంలో ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెరిగిన ధరలను బట్టి వేట నిషేధ పరిహారం 20,000రూ. ఇవ్వాలని సిపిఎం కోరుతుందన్నారు.

