దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ నేతలు చెప్పారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్ల పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం కాకినాడలోని ఓ హోటల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి నేతలు కోరారు. ఈ పార్టీలకు చెందిన నేతలు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏ.ఐ.సీ.సీ. సభ్యుడు వి. హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీ.జే.పీ. పాలన సాగిస్తోందన్నారు. రైతులకు, మహిళలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు.
రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోద నిమిత్తం బీ.జే.పీ. తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వ శేషబాబ్జి, ఎం. రాజశేఖర్, సి.పి.ఐ. నాయకులు కే బోడకొండ, ఆప్ నాయకులు నరాల శివ, కృష్ణమోహన్, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

