శ్రీశైలం మల్లికార్జునుడికి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం క్రతువును వై.సీ.పీ. కావాలనే వాయిదా వేస్తూ వస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ పవిత్ర కార్యాన్ని జరిపించడంలేదని అన్నారు. తాడేపల్లిగూడెం నియోకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. దక్షిణాయనంలో ఉన్న శివుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీ గండం అని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతోనే కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు పర్యాయాలు ఏ కారణం చెప్పకుండా రద్దు చేశారని తెలిపారు.
ఇటీవల కొందరు పెద్దలు గట్టిగా నిలదీస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని కొత్త కథలు చెబుతున్నారన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని వై.సీ.పీ. కావాలని ఆపేసింది.. ఇది ఆదిదేవుడైన శివుడికి ఆగ్రహం కలిగించే నిర్ణయం అవుతుందన్నారు. కచ్చితంగా శివుడు మూడో కన్ను తెరిస్తే ఆ మంటల్లో వై.సీ.పీ. కాలిపోతుందని హెచ్చరించారు. అనంతరం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం ఎం.పీ. అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మలను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

