పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిప్రత్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో సాయి ధరమ్ తేజ్ పై వై.సీ.పీ. రౌడీ మూకలు దాడి చేసే ప్రయత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు అన్నారు. వై.సీ.పీ. మూకలు విసిరిన గాజు ముక్కలు తగిలి స్థానిక జన సైనికుడు శ్రీధర్ తలకు తీవ్రమైన గాయం కావడం చాలా బాధాకరమన్నారు.
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని ఆయన తెలిపారు. జనసేన పార్టీ ర్యాలీ సందర్భంలో వై.సీ.పీ. రౌడీలు ఘర్షణ వాతావరణం సృష్టించి జనసైనికులను భయాందోళనలకు గురి చేసేందుకు రాళ్లు, గాజు సీసాలు విసిరే ప్రయత్నం చేశారని అన్నారు.
జనసేన పార్టీ చేస్తున్న ర్యాలిలోకి వై.సీ.పీ. రౌడీ మూకలు చొచ్చుకొని రావడం, వై.సీ.పీ. జెండాలు ప్రదర్శిస్తూ జన సైనికులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా స్థానిక పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం..? అని ప్రశ్నించారు.
