రెక్కాడితే గానీ డొక్కాడని కష్ట జీవులు, భవన నిర్మాణ కార్మికుల నిధులను దోచుకున్న వై.సీ.పీ. ప్రభుత్వం కాలం తీరి పోయే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలో డా. జ్యోతుల శ్రీనివాస్ నేతృత్వంలో సురక్ష కళ్యాణ మండపంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల భరోసా కార్యక్రమంలో నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. అధికారం చేపట్టిన మొదట్లోనే ఇసుక కృతిమ కొరతను సృష్టించి భవన నిర్మాణ కార్మికులకు పని చేసే అవకాశం లేకుండా చేశారని అన్నారు. అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న కారణంగా వారి కుటుంబాలు రోడ్లపై పడ్డాయని, ఆ బాధాకర పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికుల కోసం బలంగా నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు.

