ఉత్తరప్రదేశ్లో జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో, చివరి దశ పోలింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి లోక్సభ స్థానంలో ఆరుగురు అభ్యర్థులపై పోటీ చేయనున్నారు. పూర్వాంచల్లోని 13 లోక్సభ స్థానాలకు జరిగే 7వ దశ పోలింగ్లో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడో దశలో 13 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం 317 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు యూ.పీ. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా శనివారం తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
ఘోసీ నుంచి అత్యధికంగా 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, డియోరియా, వారణాసిలో అత్యల్పంగా 7 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఆయన చెప్పారు. మహరాజ్గంజ్లో 8 మంది, గోరఖ్పూర్లో 13 మంది, ఖుషీనగర్లో 9 మంది, బన్స్గావ్లో 8 మంది, సేలంపూర్లో 9 మంది, బల్లియాలో 13 మంది, ఘాజీపూర్, చందౌలీ, మీర్జాపూర్లో ఒక్కొక్కరు 10 మంది, రాబర్ట్స్గంజ్ లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోనేభద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ ఉప ఎన్నికలో 6 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

