ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా వచ్చి తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంతోపాటు జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేసి, అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘంగా మొదలై సమాజ సేవలో నిరంతరం భాగం అవుతూ వచ్చిన అఖిల భారత చిరంజీవి యువత నేడు రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకు వచ్చి నిలబడడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

