ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని ఆయన తెలిపారు.
బుధవారం ఉదయం కాకినాడ జి.జి.హెచ్. ప్రాంగణంలో సి.హెచ్. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన శానిటేషన్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం లో శేషబాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ నిర్వహించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అయితే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అందుకు తగిన విధంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదన్నారు.
పాలకుల హామీ ప్రకారం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు అందరినీ నిర్ధిష్ట సమయంలో పర్మినెంట్ చేయాలని సి.ఐ.టి.యు. డిమాండ్ చేస్తోందన్నారు. ప్రస్తుత పోరాటం అనుభవాలతో, సంఘటితమై భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జె. శేషు, ఎస్. వాసు, జె. లక్ష్మీ ప్రియ, కృష్ణవేణి, మంగతాయారు, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

