జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వర్మకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ తో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ల టి.డి.పి. ఇంచార్జ్ సుజయ కృష్ణ రంగారావు , వర్మ సమావేశం అయ్యారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడ కచ్చితంగా పవన్ కల్యాణ్ ని భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. త్వరలో తన ప్రచారం పిఠాపురం నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పి తొలుత పురుహూతికదేవి ఆలయంలో పూజలు చేసి, శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకొంటానని తెలిపారు. వర్మ ఇంటికి వెళ్ళిన తరవాత పిఠాపురం నియోజకవర్గం టీ.డీ.పీ. నాయకులతోనూ సమావేశమవుతాననీ, మూడు పార్టీలు సమన్వయంతో కలసి ఎన్నికల్లో పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

