కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ శాశ్వత ఇళ్ళు పధకంలో చేపడుతున్న పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమకు అప్పగించని స్థలాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారాని లబ్ధిదారులు వారి పట్టాలను చూపించి అధికారులను నిలదీశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలు మాట్లాడుతూ… గ్రామంలో సుమారు 350 ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తమకు ఇప్పటి వరకూ స్థలాలు అప్పగించలేదన్నారు. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయానికి రమ్మని అధికారులు చెబితే వచ్చామన్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసేముందు మాకు స్థలాలు చూపించి చెయ్యాలని అధికారులను నిలదీసారు.
అప్పటి వరకూ రిజిస్ట్రేషన్ లు ఆపాలని డిమాండ్ చేశారు. దానికి గ్రామ వీఆర్వో వివరణ ఇస్తూ తాము ఇప్పటికే ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టిలో పెట్టడం జరిగిందన్నారు. అయితే వారు వచ్చి సమస్య పరిష్కరించేంత వరకూ మాకు ఎవరికీ రిజిస్ట్రేషన్ చెయ్యవద్దని లబ్ధిదారులు ఆందోళన చేసారు.

