రాబోయే 2024-25 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సును జిల్లా యంత్రాంగం, బ్యాoకర్ల సమన్వయంతో నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జే.సీ. అధ్యక్షతన బ్యాంకర్లు, అధికారుల సమన్వయంతో టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయాల మేరకు స్థానిక వ్యవసాయ పెట్టుబడులను వ్యవసాయ అధికారుల ద్వారా ప్రతిపాదనలను క్రోడీకరించి బ్యాంకు రుణాల పరిమితులను నిర్ణయించడం జరిగిందన్నారు. ఆ ప్రకారం జిల్లాలో రానున్న ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పంట సాగుకు ఎకరాకు 38వేల నుండి 45 వేల వరకు, రబీ సీజన్లో 42 వేల నుండి 49 వేల వరకు పంట రుణ పరపతిని నిర్ణయించామన్నారు.
అదేవిధంగా మొక్కజొన్న పంట సాగుకు రబీ సీజన్లో 33 వేల నుండి 38వేల వరకు, పప్పుధాన్యాల పంటల సాగుకు 17 వేల నుండి 20 వేల వరకు, వేరుశనగ పంట సాగుకు 24 వేల నుండి 32 వేల వరకు పంట రుణాలను నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో ఆర్ వి నరసింహారావు,ఎల్డీఎంకే శ్యాంబాబు, వివిధ శాఖల సిబ్బంది బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

