పార్టీ కార్యకర్తలు రాజకీయ సైద్దాంతిగా అవగాహనతో ఉండాలని దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ పని విధానం అనే అంశం పై వర్క్ షాప్ కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర్ చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాటిపాక మధు సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా జెవి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పార్టీ శ్రేణులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారితో మమేకమై పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో బూర్జవా పార్టీలు అధికారం కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నాయని ఆయన గుర్తు చేశారు, అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నాయన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మతాన్ని, కులాన్ని వాడుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఈ రాష్ట్రంలో వైసీపీ, జనసేన మరియు టీడీపీ పార్టీలకు రాజకీయ స్పష్టత లేదని మూడు పార్టీలు నరేంద్ర మోడీకి గులాంగిరి చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సహజ వనరులను అమ్మి వేస్తున్నా… నోరు మెదపడం లేదని ఆయన తెలిపారు. బూర్జవ పార్టీలు పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేస్తాయన్నారు. ప్రజల్లో ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చి ఈ దోపిడీదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త మేనిఫెస్టోను చదవాలని దాని అర్థం చేసుకోవాలని తద్వారా సోషలిజం సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి
వి. కొండలరావు, తదితరులు పాల్గున్నారు
దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడదాం…. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

