తుఫాన్లు వరదల కారణంగా పంట నష్టం ప్రతి సంవత్సరం రైతాంగాన్ని తీవ్ర నష్టానికి గురి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముంపు ప్రాంతాల పంట రక్షణ సంబంధించి ప్రణాళిక ఉండాలని, అయితే ప్రస్తుతం అలా ఉన్నట్లు కనిపించట్లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోమ వీర్రాజు అన్నారు. కరప మండలంలోని యండమూరు ముంపు ప్రాంతాలను రైతు భరోసా కేంద్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం బీజేపీ నగర్ కన్వీనర్ గట్టి సత్యనారాయణ స్వగృహంలో విలేఖలు సమావేశంలో మాట్లాడారు.
రైతు భరోసా కేంద్రాలు ధాన్యంలో తేమను నిర్ణయించిన అనంతరం కూడా మిల్లర్లు ధాన్యంలో తేమను మళ్లీ పరీక్షించి తద్వారా ధాన్యం రేటును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, రైతు భరోసా కేంద్రాలు నిర్ణయించిన తేమ శాతం ప్రకారం మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, చేస్తామని ప్రభుత్వం ఒకపక్క చెబుతుండగా మిల్లర్లు మళ్లీమళ్లీ తేమ శాతాన్ని పరీక్షించడంలో ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

