కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారావు అధ్యక్షతన పౌరసంక్షేమసంఘం పిలుపు మేరకు స్థానిక జయప్రకాష్ నగర్ లో స్థానిక పౌర సమావేశం నర్వహించారు. ఈ సమావేశంలో 25వేల జనాభాతో వున్న తూరంగి అర్బన్ లో కార్పోరేషన్ పౌర సౌక ర్యాలు కల్పించడంలేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువయ్యిందని అన్నారు. త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల నిర్వహణ మృగ్యం అయ్యిందన్నారు.
13 ఏళ్లుగా పంచాయతీ రాజ్ నుండి వేరు చేసి అర్బన్ పరిధికి తెచ్చిన తూరంగి గ్రామాన్ని కాకినాడ నగర పాలక సంస్థలో విలీనం చేయక పోవడం వలన అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. నగరంలో విలీనం చేయాలని హైకోర్టు లో వున్న స్టే తొలగించే ప్రక్రియ ప్రభుత్వం తీసుకోవాలని వారు కోరారు. రాజకీయాలకు అతీతంగా తూరంగి అభ్యున్నతి కోరుతూ కాకినాడ అర్బన్ గ్రామాలవిలీన సాధన సమితి ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు.

