ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు. ఎస్.జీ.టీ. టీచర్ పోస్టులకు బీ.ఈ.డీ. అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీ.ఈ.డీ. అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయవాది తెలిపారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ వెల్లడించారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషన్ పై అత్యవసర విచారణ సోమవారం చేపడతామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
