భారతీయ జనతా పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు టీ.డీ.ఆర్. బండ్ల కుంభకోణంపై విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టటం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, రాష్ట్ర మేధావిభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీ.జే.పీ. రాష్ట్ర నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తదితరులు పేర్కొన్నారు. దుమ్ములపేటలో అధిక రేటుతో టీ.డీ.ఆర్. బాండ్లు విడుదల చేసి కొనుగోలు చేసిన భూమి కి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని, తాకట్టులో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించి దుమ్ములపేట వాసులకు సబ్ స్టేషన్ నిర్మాణం, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టడం ప్రైవేటు భూములను ప్రజా అవసరాల కోసం అత్యధిక విలువ చెల్లించికొనుగోలు చేయటం పరిపాటిగా మారిందని టీ.డీ.ఆర్. బాండ్లు భూ కొనుగోలుకు వాడటం నిబంధనలకు విరుద్ధమని బీ.జే.పీ. నాయకులు అభిప్రాయపడ్డారు. తాము ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశామని ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టడం అభినందనీయమని అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన టీ.డీ.ఆర్. బాండ్లు రద్దు అయ్యే వరకు, విడుదల చేసిన అధికారులపై కేసులు నమోదు చేసేవరకు బీ.జే.పీ. అన్ని స్థాయిల్లోనూ అన్ని మార్గాల్లోనూ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. వైయస్సార్ పార్టీ ప్రభుత్వం తాకట్టుకేదీ కాదు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోందని ఎమ్మార్వో కార్యాలయాలు నుంచి కలెక్టర్ల కార్యాలయాల వరకు అన్నిటినీ తాకట్టు పెట్టడం ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నామని మండిపడ్డారు.

