టిడ్కో ఇళ్ళకు సంబంధించి పెండింగ్లో ఉన్న రుణాలను వెంటనే మంజూరు చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగ నరసింహారావు బ్యాంకర్లను కోరారు. తన ఛాంబర్లో బ్యాంకర్లు, నగరపాలక సంస్థ అధికారులు, మెప్మా సిబ్బంది, సీవోలతో టిడ్కో ఇళ్ళ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… తొలివిడత 1152 టిడ్కో ఇళ్ళకు గాను ఇంకా 144 ఇళ్ళకు 25 శాతం రుణాలు మంజూరు కావల్సి ఉందన్నారు. ఆయా బ్యాంకర్లు దీనిపై చొరవ తీసుకుని నూరుశాతం రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ మేరకు మెప్మా సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేసి ఈ నెల 25వ తేదీలోపుగా రుణ ప్రక్రియ పూర్తి అయ్యేలా చూడాలని, సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అలాగే టిడ్కో ద్వారా పెండింగ్లో ఉన్న 304 మంది లబ్థిదారులకు సంబంధించిన మార్ట్గేజ్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్మేనేజర్ ప్రసాద్, మెప్మా ఏ.వో. శివప్రసాద్, టీ.పీ.ఆర్.వో. మానే కృష్ణమోహన్, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకట్రాజు, ఆయా బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

