జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, ఎ.పి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఐ.ఎన్.టి.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, తదితరులు మాట్లాడుతూ… ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పై దాడులు పెరిగాయని అన్నారు. ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటున్న జర్నలిస్టుల పై ప్రభుత్వాలు దాడులకు పాల్పడడం హేయమైన చర్చ గా నాయకులు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేస్తున్నారని వారు విమర్శించారు. ప్రజా గళాలపై జరుగుతున్న నిర్బంధ కాండను ప్రజలంతా నిరసించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు సి.హెచ్. అజయ్ కుమార్, కె. వీరబాబు, చైతన్య రెడ్డి, కె.వి.పి.ఎస్. జిల్లా కార్యదర్శి కే. సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
