బీ.జే.పీ. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రైతు కార్మిక ప్రజా అనుకూల విధానాలకే పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చాయి. ఈ పిలుపును కాకినాడ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు ఏ.ఐ.టీ.యు.సీ., బీ.కే.ఎం.యు., ఏ.ఐ.కే.ఎస్. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏ.ఐ.టీ.యూ.సీ. సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన సమ్మె వాల్ పోస్టర్ ను సామర్లకోటలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు వద్ద ఆవిష్కరించారు.
ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు నిర్వహించాలని, పరిశ్రమలన్నింటిలో కార్మిక సమ్మె జరపాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ బందుకు ప్రజలందరూ మద్దతు పలకాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిశెట్టి రామదాసు, మడగల రమణ, సప్ప సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
