ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రాజ్యసభ ఎం.పీ. రేణుకా చౌదరితో కలిసి రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రసంగిస్తూ… అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలిచారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తాము సంతృప్తిగా ఉన్నామన్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మంత్రులు చెప్పారు. ఖమ్మం నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఈ ర్యాలీలో వామపక్షాల నాయకులు కూడా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ… కాంగ్రెస్ అభ్యర్థులపై బీ.ఆర్.ఎస్. కుట్రలు చేస్తోందని కానీ వారు తమ ప్రయత్నాలలో విజయం సాధించలేరని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీ.ఆర్.ఎస్. విచ్ఛిన్నమవుతుందని అన్నారు. కాగా తనకు మద్దతుగా నిలిచిన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

