రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో వాలంటీర్ల అవినీతి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ లక్ష్యాలు నీరుగారి పోతున్నాయని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ చిలుకూరు రామకుమార్, రంబాల వెంకటేశ్వరరావు, శ్రీ ముత్తా నవీన్, తదితరులు స్థానిక ఆర్టీవో ఆఫీస్ రోడ్డులో జిల్లా పంచాయతీ ఆఫీసర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి జిల్లా పంచాయతీ ఆఫీసర్ కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్ర కాపీలను కేంద్ర జలశక్తి మంత్రివర్యులు జితేంద్ర సింగ్ షికావత్, కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి పంపించారు.
2024 మార్చినాటికి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ మంచినీరు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషను ప్రవేశపెట్టడం జరిగిందని, దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు బదిలీ చేస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను విడుదల చేయని కారణంగా ఒకపక్క గ్రామాల్లో సచివాలయంలో కొందరు వాలంటీర్ల అవినీతి కారణంగా జలజీవన్ మిషన్ లక్ష్యాలు నీరుగారుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఆ వినతి పత్రంలో తెలియజేసింది.
సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జలం కావాలంటే జలగల్లా పీడిస్తున్న వాలంటీర్ల డౌన్ డౌన్, జగన్ ప్రభుత్వం డౌన్ డౌన్ ,అక్రమంగా వసూలు చేసిన అవినీతి సొమ్మును తక్షణం ప్రజలకు బదిలీ చేయాలి అంటూ పెద్ద ఎత్తున బాధితులు, కార్యకర్తలు నినదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు ముత్త నవీన్ ,పెద్దిరెడ్డి రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు

