కాకినాడ పార్లమెంటుతో సహా ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపు తద్యమని, ఏ అసెంబ్లీ నియోజకవర్గం లోను మెజారిటీ 50 వేల ఓట్లు కు తగ్గదని మెజారిటీ ఇంకా పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తామని బీ.జే.పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి, బీ.జే.పీ. కాకినాడ పార్లమెంటు సమన్వయకర్త యార్లగడ్డ రామ్ కుమార్, నరసాపురం నియోజకవర్గం బీ.జే.పీ. ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
ఆదింవారం ఉదయం 11:30 గంటలకు స్థానిక ట్రెజరీ కాలనీలో నీ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులు ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… బీ.జే.పీ. కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థులతో సమన్వయంతో పని చేయడం జరుగుతుందని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ఏకైక ప్రభుత్వం వై.సి.పి. పార్టీ ప్రభుత్వమని, కార్మికులు, రైతులు ,విద్యార్థులు, గృహిణులు, యువకులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఏ ఒక్క వర్గము ఈ వై.సి.పి. ప్రభుత్వ పాలనలో సంతృప్తికరంగా లేరని అన్నారు.
రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులు పెరిగాయని, ఇంటి పనులు పెరిగాయని, చెత్త మీద పన్ను వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమేనని అన్నారు, రాష్ట్ర రహదారుల మీద అరగంట ప్రయాణం చేస్తే రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. వై.సీ.పీ. నాయకులకు, పాలకులకు అభివృద్ధి కి సంబంధించి ఒక ప్రణాళిక లేదని అప్పుచేసి పప్పుకూడు రీతిన పాలకులు ఈ ఐదు సంవత్సరాలు పాలన సాగించారని తీవ్రంగా దుయ్యబట్టారు.

