ప్రపంచంలో నేడు జరుగుతున్న కార్మిక వర్గ పోరాటాల్లో లెనినిజం ఉందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ తెలిపారు. కాకినాడ యు.టి.ఎఫ్. హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో లెనినిజం విశిష్టత – అక్టోబర్ విప్లవం – భారతదేశం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎం.వి.ఎస్. శర్మ ముఖ్యవక్తగా ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ విముక్తి సిద్దాంతాన్ని మార్క్స్ ఎంగెల్స్ రూపొందించగా, ఆచరణలో కార్మిక రాజ్య స్థాపన ఎలా జరుగుతుందో కార్యాచరణ ద్వారా లెనినిజం సాకారం చేసిందన్నారు. కార్మిక కర్షక మైత్రి ప్రాధాన్యతను లెనినిజం చాటి చెప్పిందన్నారు. లెనిన్ ప్రసిద్ధ రచన “ఏమిచేయాలి” కార్యాచరణ కు మార్గదర్శిగా ఉందన్నారు. భగత్ సింగ్ ఉరితీసే కొన్ని క్షణాల ముందు కూడా లెనిన్ రచనలు అధ్యాయనం పూర్తి చేసి ఉరికంబం ఎక్కారని తెలిపారు.
