ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా… ఆయా నియోజకవర్గాలకు చెందిన ఈ.ఆర్.వో. లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల సీ.ఈ.వో. అన్ని జిల్లాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 పురోగతిని సమీక్షించారు. కాకినాడ జిల్లాలో ఎస్ఎస్ఆర్-2024కి సంబంధించి వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ సీ.ఈ.వో. కు వివరించారు. ప్రధానంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

