ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్వో లు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలుకు తావు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలంలో రాజవోలు శ్రీకర ఫంక్షన్ హాల్ లో బుధవారం రూరల్ నియోజకవర్గం బి.ఎల్.వో. లు ఇతర ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా అనుబంధ అంశాలపై కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనలో బి.ఎల్.వో. లదే ప్రధాన పాత్ర అన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్ల ఎన్నికల భాగస్వామ్య సంస్కృతిని బలోపేతం చేయాలని అన్నారు. వారికి చెందిన ఓటరు జాబితాను తరచుగా తనిఖీ చేసి సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్య మన్నారు.

