ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి డా. కృతికాశుక్లా ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీ.ఈ.వో. ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రోల్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి, ఆయా నియోజకవర్గాల ఈఆర్వోలతో కలిసి హాజరయ్యారు. ఫాం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం, తుది ఓటర్ల జాబితాలోని సమస్యలు, మార్పులు చేర్పులు, 18-19 వయస్సు గల ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీపాడ్స్ స్టోరేజ్ ప్రణాళిక, కౌంటింగ్ కేంద్రాలు వంటి అంశాలపై ఎన్నికల సీఈవో ఈ సందర్భంగా కలెక్టర్లతో చర్చించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో మాట్లాడుతూ… సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తతతో ఉండడంతో పాటు ఎన్నికల కమిషన్ నిబంధన సక్రమంగా అమలు చేయాలన్నారు. గత నెల 22న తుది ఓటరు జాబితా ముద్రించడం జరిగిందని జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1,637 పోలింగ్ కేంద్రాల్లో 15,99, 613 ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.

