రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే కక్ష సాదించి పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వై.సీ.పీ. ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండి పడ్డారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణారహితంగా వై.సీ.పీ. మూకలు చేసిన దాడి ఆ పార్టీవాళ్ల హింసా ప్రవృత్తిని వెల్లడిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఈనాడు పై అదే విదంగా దాడులకు పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలని అన్నారు.
ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించాలి…
