కొత్త ఆలయాలను నిర్మించడం కంటే ఉన్నవాటికి నూతనత్వం కల్పించి పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అవసరమని పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. కోరుకొండ గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో చేపట్టిన పలు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు. ముందుగా మధురపూడి ఎయిర్ పోర్ట్ నందు చిన్న జీయర్ స్వామికి ఎమ్మెల్యే రాజా ఘన స్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా కోరుకొండ స్వగృహం చేరుకున్నారు.
అనంతరం స్వామి గారి చేతుల మీదుగా భక్తులకు తీర్థగోష్ఠి కార్యక్రమం చేపట్టారు. తిరుపతి తిరుమల దేవస్థానం మరియు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి 40 లక్షల రూపాయలతో చేపడుతున్న శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ పునఃనిర్మాణములో భాగంగా కళాపకర్షణ, బాలలయ మహా సంప్రోక్షణ ప్రతిష్ట కార్యక్రమం వారి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైష్ణవ సంప్రదాయంలో ఎంతో విశిష్టత గల ఆలయాల్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఒకటన్నారు. ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని అయితే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

