అవినీతిని సమూలంగా నిర్మూలించామని ఘంటాపదంగా చెబుతున్న నేతల మాటలకు కాకినాడ రూరల్ వలసపాకల పంచాయితీ సెక్రటరీ ఎండి మున్నీషాబీబీ నిర్వాకం మింగుడుపడనిదిగా మారింది. రెండు వేల 50 రూపాయల ఇంటి పన్ను వేసే నిమిత్తం 10,500 రూపాయలను డిమాండ్ చేసిన వైనం ఆమె అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలిచింది. సుమారు అన్ని పంచాయితీల్లోనూ ఇదే విధంగా జరుగుతుందని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పడం ప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతోంది. వివరాల్లోకెళ్తే… వలసపాకల పంచాయితీ పరిలోని పాలిక పద్మావతి ఆమె భర్త బాపూజీ ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశారు. వారిద్దరూ వృద్దులు కావటంతో తిరగలేక సమీప బందువైన సూరంపూడి కిషోర్తో మాట్లాడి ఇంటి పన్ను వేయించాల్సిందిగా కోరారు.

